తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటి రోజున కనుమ పండుగనాడైన జనవరి 16న అత్యంత ఘనంగా జరగనుంది. అదే రోజున గోదా పరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు. గోదాపరిణయోత్సవం సందర్భంగా ఉదయం 9.00 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్స్వామి మఠం నుండి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పిస్తారు.
ఆనంతరం మధ్యాహ్నం 1.00 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకుంటారు. ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే తోమాలసేవ, అర్చన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.