లాక్డౌన్ సమయంలో సౌకర్యవంతమైన వాతావరణం ఉండదని, ప్రజలంతా దీనికి సహకరించాలని హైదరాబాద్ నగర సీపీ అంజనీ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు 21 రోజులపాటు లాక్డౌన్ కొనసాగుతుందని చెప్పారు.
బుధవారం నగరంలోని వివిధ సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశయ్యారు. లాక్డౌన్ సమయంలో పాటించాల్సిన నిబంధనలను వివరించడంతో పాటు వారికి పలు సూచనలు చేశారు. అనంతరం సీపీ మీడియాతో మాట్లాడారు. అత్యవసర విభాగాల్లో పనిచేసేవారికి పాస్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు అంజనీకుమార్ వెల్లడించారు.
పాస్లు కావాల్సిన వారు పోలీస్స్టేషన్ల వద్దకు రావాల్సిన అవసరం లేదని హెల్ప్లైన్ను సంప్రదించాలని సూచించారు. వివరాలను 94906 16780 నంబర్కు వాట్సాప్ చేయడంతో పాటు covid19.hyd@gmail.com ద్వారా కూడా సంప్రదించవచ్చని.. పాస్లు కావాల్సిన వారితో తమ సిబ్బంది మాట్లాడి అంజేస్తారన్నారు.
ఇప్పటి వరకు నగరంలో 900కు పైగా పాస్లు ఇచ్చామని అందులో కొందరికి వ్యక్తిగతం గానూ మంజూరు చేశామన్నారు. మరో 700 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వాటిని పరిశీలించి అర్హులకు అందిస్తామన్నారు. పాస్లను దుర్వినియోగం చేస్తే ఇచ్చిన వాటిని రద్దు చేయడంతో పాటు కొత్తగానూ మంజూరు చేయబోమని హెచ్చరించారు.
లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ప్రజలు సహకరించాలని.. అందరూ క్రమశిక్షణ, ఐకమత్యంతో మెలగాలని సీపీ విజ్ఞప్తి చేశారు. 10వేల మంది నగర పోలీసులు 24 గంటలూ పనిచేస్తున్నామన్నారు. గోదాముల నుంచి కూరగాయలు తరలించేటపుడు చిన్న ఆటోలను మాత్రమే వాడాలని ఆయన సూచించారు.