రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో జిల్లా పాలనాధికారి, మున్సిపల్ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మెన్, వార్డు కౌన్సిలర్ లు, వార్డు స్పెషల్ అధికారులు పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పలు వార్డుల్లో ర్యాలీలు చేపట్టి పట్టణ ప్రగతి కార్యక్రమంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపల్ పరిధిలోని 26వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్యపనులు ఎలా ఉన్నాయో క్షేత్ర స్థాయిలో చూస్తూ, అవసరమైన చోట్ల మురుగు కాలువలు, త్రాగు నీటి సదుపాయాలు కల్పించుకోవాలని అన్నారు. అదే విధంగా వీధి దీపాల ఏర్పాట్ల తో పాటుగా ప్రతి వార్డులో ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాల కల్పన కోసం చేపట్టాల్సిన ప్రణాళికలను సిద్దం చేసుకుంటూ, అక్కడిక్కడే చేయాల్సిన పనులను పూర్తి చేస్తూ పట్టణాన్ని సుందరంగా మలచుకోవడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి కార్యక్రమం పది రోజుల పాటు కొనసాగుతుందని మీ మీ వార్డుల్లోని సమస్యలను వార్డు ప్రత్యేక అధికారులకు తెలియజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేసి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.
previous post