Slider ప్రత్యేకం

పవన్‌ పేరుతో ఆ అధికారి దోపిడీ… డిప్యూటీ సీఎం ఏం చేశాడంటే..

#pavankalyan

ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగు నెలలుగా టీడీపీ కూటమి పాలన కొనసాగుతోంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో పాలన వేగం పుంజుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు పరిపాలన అనుభవం లేకున్నప్పటికీ.. డిప్యూటీ సీఎంగా పవన్‌ కళ్యాణ్‌ బాధ్యతలు తీసుకున్న మరుక్షణం నుంచే తన మార్క్‌ పాలనను చూపిస్తున్నారు.

సమస్యలపై తన దగ్గరకు వచ్చే వారి సమస్యలను పూర్తిగా అర్థం చేసుకున్న తరువాత వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. కొందరు తను చూస్తున్న మంత్రిత్వ శాఖలకి సంబంధించి కాకుండా వ్యక్తిగత సమస్యలపై వచ్చిన వారితోనూ మాట్లాడి వారి సమస్యలను అధికారులకి చెప్పి పరిష్కరిస్తున్నారు. తనకు ఇష్టమైన పంచాయతీరాజ్‌ శాఖను తీసుకుని బాధ్యతగా నిర్వహిస్తున్నారు. దాంతోపాటు పర్యావరణహితంపై ఎక్కువ మక్కువతో ఆ శాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. పంచాయతీరాజ్‌ శాఖలో ఒకేసారి నాలుగువేలకి పైగా గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించి.. ప్రపంచ రికార్డును సృష్టించారు.

అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్యతోపాటు.. రోడ్ల సమస్యలపై దృష్టి సారించారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి తన శాఖకి చెందిన అధికారులతో నిత్యం సమీక్షలను నిర్వహిస్తున్నారు. తాను చూస్తున్న శాఖల్లో ఎక్కడా అవినీతి, అక్రమాలకు తావు లేకుండా.. ఎక్కడా ఏ ఫైల్‌ కూడా ఆలస్యం కాకుండా చూస్తున్నారు. తన శాఖలో బాగా పనిచేయించాలనే ఉద్దేశంతో కేరళ క్యాడర్‌కి చెందిన ఏపీకి చెందిన యువ ఐఏఎస్‌ అధికారిని కేంద్రంతో మాట్లాడి మరీ డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి తెప్పించుకుని పరిపాలన కొనసాగిస్తున్నారు.

అధికారులు ఎక్కడా తప్పు చేయకుండా సిన్సియర్‌గా  ఉండేలాగా వ్యవహారిస్తున్నారు. అయితే ఇప్పుడు కాకినాడకి కొత్తగా వచ్చిన జిల్లా ఫారెస్ట్‌ అధికారి(డీఎఫ్‌వో)పై విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది.  సత్యసాయి జిల్లా నుంచి డీఎఫ్‌వోగా కాకినాడ జిల్లాకి బదలీపై వచ్చారు. బదలీపై వచ్చిన డీఎఫ్‌వో తన సబార్డినేట్‌ అధికారులను పిలిపించుకొని జిల్లాకి చెందిన మైనింగ్‌ వివరాలను తెలుసుకున్నారు. కిందిస్థాయి అధికారుల నుంచి వివరాలు తీసుకున్న అనంతరం డీఎఫ్‌వో రవీంద్రనాధ్‌ రెడ్డి క్వారీల నుంచి మైనింగ్‌ చేయకుండా ఆపేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలోని ఏ క్వారీలో కూడా మైనింగ్‌ చేయకుండా ఆదేశాలు జారీ చేసిన డీఎఫ్‌వో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఆదేశాల మేరకే తాను ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మైనింగ్‌ కొనసాగించాలంటే రూ. 4 కోట్లు ఇవ్వాలని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.  తాము  అనుమతులు తీసుకున్న ప్రాంతాల్లో కూడా మైనింగ్‌ చేయకుండా నిలుపుదల చేయడంతో క్వారీ యజమానులు ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి విషయం చేరవేశారు. తాము మైనింగ్‌ కోసం అనుమతులు తీసుకున్నామని నిన్నటి వరకు మైనింగ్‌ చేశామని ఇప్పటికిప్పుడు డిప్యూటీ సీఎం ఆదేశించారని చెప్పి మైనింగ్‌ చేయకుండా ఆపేశారని గుత్తేదారులు పవన్‌ కళ్యాణ్‌ ఆఫీస్‌లోని అధికారులకి విషయం చెప్పారు.

దీంతో విషయం కాస్త డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. విషయం తెలుసుకున్న పవన్‌ కళ్యాణ్‌ తాను అటువంటి ఆదేశాలు ఏమీ ఇవ్వలేదని చెప్పారు. దీంతో డిఎఫ్‌వో రవీంద్రనాధ్ రెడ్డి వ్యవహారశైలిపై  విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఆదేశించినట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు రాయలసీమ ప్రాంతంలో డీఎఫ్‌వో పనిచేసిన వచ్చిన రవీంద్రనాధ్‌ రెడ్డి డిప్యూటీ సీఎం నియోజకవర్గం ఉన్న కాకినాడ జిల్లాకి బదలీపై వచ్చీ రావడంతోనే అవినీతికి పాల్పడటంతో సీరియస్‌గా తీసుకున్న పవన్‌ కళ్యాణ్‌ విచారణ జరిపించి నివేదికను ఇవ్వాలని మైనింగ్‌ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.

Related posts

వర్ష సూచన నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

Satyam NEWS

హనుమంత వాహనంపై ప్రసన్న వేంకటేశ్వరస్వామి

mamatha

కులాంతర వివాహం చేసుకున్న వాల్మీకి ఆడబిడ్డపై భౌతిక దాడులు

mamatha

Leave a Comment

error: Content is protected !!