సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో పెద్ద ఎత్తున కల్తీ పాలు తయారవుతున్నాయి. పవిత్ర డైరీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నడుస్తున్న ఈ ఫ్యాక్టరీలో కల్తీ పాలు, పెరుగు,పన్నీరు తయారీ చేస్తున్నారు. సహజమైన పాల స్థానంలో కెమికల్ పాలు తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఈ కంపెనీపై పోలీసులు ఆకస్మిక దాడి జరిపారు. పటాన్ చెరు డీఎస్ పి భీంరెడ్డి నేతృత్వంలో పోలీసు బృందం తనిఖీ చేసినప్పుడు ఆందోళన కలిగించే అంశాలు వెల్లడయ్యాయి.
కెమికల్ తో వివిధ కంపెనీల బ్రాండ్లతో పాల ఉత్పత్తులను ఈ కంపెనీ తయారీ చేస్తున్నదని డీఎస్ పి భీంరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆధారాలు సేకరించినందున నిర్వాహకులపై చీటింగ్ కేసు నమోదు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పవిత్ర మిల్క్ డైరి మేనేజర్ ప్రసాద రావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తం 6 వేల లీటర్ల కల్తీ మిల్క్ ఉత్పత్తులు సీజ్ చేసినట్లు పటాన్ చెరు డీఎస్ పి భీంరెడ్డి తెలిపారు.