కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం లో ఈ నెల 16న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టనున్న పర్యటనను విజయవంతం చేయాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వేగుళ్ళ లీలాకృష్ణ ఆధ్వర్యంలో గొల్లపుంత రోడ్డులోని శుభమస్తు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దుర్గేష్ ముఖ్య అతిధి గా పాల్గొని మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ మహా యజ్ఞంగా రైతు భరోసా కార్యక్రమం చేపట్టారన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 54 మంది రైతుల ఆత్మహత్యలకు సంబంధించి నివేదిక అందగా వారి కుటుంబాలకు రూ. లక్ష రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా రాజమహేంద్రవరం నుండి మండపేటకు చేరుకునే నేపథ్యంలో మూడు చోట్ల కౌలు రైతుల కుటుంబాలను ఆయన కలుస్తారని, అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు గొల్లపుంత రోడ్డులో బహిరంగ సభ జరుగుతుందన్నారు.
లీలాకృష్ణ పర్యవేక్షణలో జరిగే ఈ కార్యక్రమాన్ని జనసైనికులు విజయవంతం చేయాలని కోరారు. వేగుళ్ళ లీలాకృష్ణ మాట్లాడుతూ ఓ గొప్ప కార్యక్రమం నిమిత్తం పవన్ కళ్యాణ్ తన నియోజవర్గంలో కి రావడం, ఇందుకు సంబంధించిన నిర్వహణ బాధ్యత తనకు అప్పగించడం తన అదృష్టం గా భావిస్తున్నట్లు చెప్పారు.
వైసీపీ నాయకులు ప్లీనరీ లో పేలుతున్న మాటలన్నింటికి పవన్ ఇక్కడ నుండే సమాధానం చెబుతారన్నారు. ఈ సభ ద్వారా జనసేన పార్టీ సత్తా ఏమిటో చాటనున్నామన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు పంతం నానాజీ, శెట్టిబత్తుల రాజబాబు, బండారు శ్రీనివాసు, అనుశ్రీ సత్యనారాయణ, ఉండమట్ల రామారావు, కుంచే వీరమణి దుర్గాప్రసాద్, సరాకుల అబ్బులు తదితరులు పాల్గొన్నారు.