‘ఇక సమయం ఆసన్నమయింది’ అంటూ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్య
ఇంతకాలం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలోనే మళ్లీ పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారు. తనపైన వైసీపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా చేస్తున్న దాడిని ఇక ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
తనపై సన్నాసులు చాలా మంది మాటల దాడి చేస్తున్నందున ఇక తగ్గి ఉండటం తన అభిమానుల మనోభావాలను దెబ్బతీస్తున్నదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడతానని ఇప్పటికే ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఏపీ సర్కారుపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతరం కూడా ట్విట్టర్ వేదికగా ఏపీ సర్కారుపై ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ మంత్రులు తనపై విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఆయన తాజాగా మరో ట్వీట్ చేశారు.
“వైసీపీ ప్రభుత్వం ‘పాలసీ ఉగ్రవాదం’కి అన్ని రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమయింది” అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.