రాష్ట్రం లోనే అతి పెద్ద లే అవుట్ లలో ఒకటైన విజయనగరం గుంకలాం జగనన్న హౌసింగ్ లే అవుట్ ను రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ సందర్శించారు. గుంకలాం లే అవుట్ లో గృహనిర్మాణ శాఖ నిర్దేశించిన ప్లాట్ లను మంత్రి జోగి రమేష్ తోబాటు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, ఎంఎల్సీ లు రఘురాజు, సురేష్ లు పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం జరుగుతున్న తీరు, కల్పిస్తున్న వసతులను మంత్రి జోగి రమేష్ పరిశీలించారు. ఇటుకల తయారీ గురించి ఆరా తీసి ఉత్పత్తిని మరింతగా పెంచాలని ఆదేశించారు.
గుంకలాం లే అవుట్ సందర్శన లో మంత్రి తో పాటు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎం.పి బెల్లాన చంద్రశేఖర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ దొరబాబు లు ఉన్నారు అనంతరం గుంకలాంలో నే మంత్రి రమేష్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో జగనన్న గృహ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. గుంకలాం లే అవుట్ లో 12,216 ఇళ్లను మంజూరు చేస్తే 10,600 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి అన్నారు.
ఇళ్ల నిర్మాణానికి ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇళ్ల నిర్మాణం ప్రక్రియ శరవేగంగా జరుగుతోందని అన్నారు. ఈ లే అవుట్ ను గతంలో సందర్శించిన జనసేన నేత పవన్ కళ్యాణ్ ఇక్కడ కమాన్ తప్ప ఏమీ లేదన్నారు. ఏ ఒక్క లబ్దిదారుడైనా తమకు ఇళ్ల నిర్మాణం లో ఇబ్బందులు ఎదురయ్యాయనీ చెప్పారా? అని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణం ఎలా జరుగుతుందో కనీసం పరిశీలన చేయకుండా చౌకబారు మాటలు మాట్లాడారని మంత్రి అన్నారు. రాష్ట్రంలో 2.50 నుంచి 3 లక్షల కోట్ల విలువైన ఆస్తిని 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇవ్వబోతున్నమని మంత్రి అన్నారు.