అశాస్త్రీయంగా చేసిన జిల్లాల విభజనపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఎప్పటినుంచో జిల్లా కోసం డిమాండ్ ఉన్న ప్రాంతాలపై అధ్యయనం కూడా చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాతో పోలవరం ముంపు మండలాల గిరిజనులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.
ఎటపాక, కుక్కునూరు లాంటి మండలాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే కనీసం 300 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ప్రజాభిప్రాయం పరిగణించకుండా జిల్లాల విభజన చేశారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జిల్లాల విభజన లోపభూయిష్టంగా సాగిందని అన్నారు.
పార్లమెంట్ నియోజకవర్గమే ప్రామాణికం అంటూ దాన్ని ఉల్లంఘించారని ఆయన అన్నారు. ప్రజల మనోగతాన్ని, కొత్త జిల్లాల మూలంగా వాళ్లు ఎదుర్కొనే ఇబ్బందులను ఎందుకు పరిగణించలేదని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రంపచోడవరం కేంద్రంగా జిల్లా కావాలన్న అక్కడి గిరిజనుల అభిప్రాయాన్ని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాయలసీమలోనూ మదనపల్లె, హిందూపురం, మార్కాపురం కేంద్రాలుగా జిల్లాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లను పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు.