అమరావతి కి అండగా ఉంటామని బిజెపి జాతీయ నేతలు తనకు చెప్పారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజధాని రైతులు ఎవరూ ఎవరూ అధైర్యపడవద్దని తాను అండగా ఉంటానని వారి తరపున పోరాడతానని ఆయన అన్నారు. నేడు ఆయన అమరావతి క్యాపిటల్ రీజియన్ లోని ఎర్రబాలెం గ్రామంలో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు.
90 శాతం భూములు ఇచ్చాక రాజధాని మార్చడం అన్యాయమని ఆయన అన్నారు. మీకు అన్యాయం జరగదు అని భరోసా ఇచ్చేందుకే నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చాను అని జనసేన అధినేత చెప్పారు. ఐదేళ్లకొకసారి రాజధాని మారుస్తామంటే మంచిది కాదని ఆయన అన్నారు. రాజధానికి రావాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను ఆహ్వానించామని ఢిల్లీ ఎన్నికల వల్ల ఆ రోజు పర్యటన వాయిదా పడిందని పవన్ కల్యాణ్ తెలిపారు.
త్వరలో జనసేన, బిజెపి నాయకులు అమరావతి లో పర్యటిస్తారని ఆయన అన్నారు. కేంద్రంలో బిజేపి రెండోసారి అధికారంలోకి రాగానే అమరావతి లో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు వచ్చాయని, అయితే జగన్ ప్రభుత్వం తీరుతో వాళ్లు వెనక్కి వెళ్లిపోయారని ఆయన తెలిపారు.
రెండు నెలలుగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నామని అమరావతి మహిళా రైతులు పవన్ కల్యాణ్ వద్ద వాపోయారు. పంట పొలాలు ప్రభుత్వానికి ఇచ్చి తాము రోడ్డుపై పడాల్సి వచ్చిందని వారు తెలిపారు. మా పొలాలు తీసుకోమని ఎవరినీ మేము అడగలేదు అయినా తీసుకుని మిమ్మల్ని రోడ్డున పడేశారని వారు తెలిపారు.
బిజెపి నేతలు అమరావతి కి అనుకూలమని చెప్పినా కేంద్రం తీరు ఆందోళన కలిగిస్తున్నదని వారు తెలిపారు. బిజెపి తో పొత్తు సమయంలో కూడా నేను రైతులకు న్యాయం చేయాలని అడిగానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం.
ఆనాటి ప్రభుత్వం, ప్రతిపక్షం కలిపే అమరావతి ని రాజధానిగా నిర్ణయించాయని ఆయన అన్నారు. ఇప్పుడు ఇష్టం వచ్చిన విధంగా మారుస్తామంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఒక వేళ బలవంతంగా తరలించినా.. వెనక్కే వస్తుంది అని ఆయన స్పష్టం చేశారు.