అకాల వర్షాల వల్ల వేల కోట్ల విలువ గల పంట నష్టం వాటిల్లిందని తెలంగాణ రైతు సంఘం ములుగు జిల్లా కార్యదర్శి ఎండి గపూర్ అన్నారు. ములుగు మండలం రాయిని గూడెం గ్రామంలో నష్టపోయిన పంటలను నేడు ఆయన పరిశీలించారు. వాకిళ్ళల్లో అరబోసిన ధాన్యం తడిసిపోయిందని, మిరప పంటకు తామర పురుగు సోకి దెబ్బతిన్నదని ఆయన తెలిపారు.
ఇక గులాబి పురుగుతో పత్తి పంటకు నష్టం జరుగగా, మిగిలిన పత్తి కూడా అధిక వర్షాల వలన దెబ్బతిన్నదని ఆయన అన్నారు. గత సంవత్సరం 12.60 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, ఈ సంవత్సరం 8.5లక్షల ఎకరాల్లో వరదల వలన పంటలు దెబ్బతిన్నాయి.
దీనికి తోడు 2022 జనవరిలో వచ్చిన అధిక వర్షాలు, రాళ్ళ వర్షాల వలన కూడా రైతుల పంటలకు నష్టం వాటిల్లింది. ఇంత జరిగినా రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వలేదు. కనీసం కేంద్ర బృందాలను పిలిచి సర్వే కూడా చేయలేదు.
నష్టపోయిన ప్రతి గింజకు పరిహారం చెల్లిస్తామని ప్రకటించిన ప్రభుత్వం నష్టాల వైపు కనీస దృష్టి కూడా పెట్టలేదు. రైతులు మాత్రం ఏటా ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోతూనేవున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా కౌలు రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు అంచనా. వీరు 15శాతం భూమిని సాగు చేస్తున్నారు. పంటలు పండినా, పండకపోయినా భూ యాజమానులకు కౌలు ఇవ్వక తప్పడంలేదు. అందువలన అప్పులపాలై ఆత్మహత్య లకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలపై స్పష్టమైన వైఖరిని అనుసరించి విధానాలు రూపొందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గుండెబోయిన రవి గౌడు, ఆగిపోయిన పోతయ్య, రైతులు చెరుకుల రాజయ్య, చెరుకుల సాంబయ్య, వరాల వెంకటేశ్వర్లు, వట్టెం సమ్మయ్య, కల్తీ నవీను, శ్రీలత, నర్సక్క, కనక్క, రమాదేవి, కవిటి చిన్న సమ్మయ్య, చెరుకుల స్వామి, తదితరులు 50 మంది మంది రైతులు పాల్గొన్నారు