కరోనా వైరస్ ప్రభావం, లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన రజకులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు కనీసం 10 వేల రూపాయల ఆర్ధిక సహకారం అందించాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం నాగర్ కర్నూలు జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి పెద్దాపురం భాస్కర్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు నేడు కొల్లాపూర్ ఆర్డిఓ కు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ, రజక వృత్తి పనులన్నీ ఆగిపోయి, తినడానికి తిండి లేక, పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రజక వృత్తిదారుల కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సహకారం అందజేయాలని, ప్రతి వ్యక్తికి 12 కేజీల బియ్యం ఇవ్వాలని ఆయన కోరారు.
రేషన్ కార్డు తో నిమిత్తం లేకుండా అర్హులు గల రజకులందరికీ బియ్యం ఇవ్వాలని, అదేవిధంగా లాండ్రీ షాపులు, ధోబి ఘాట్ కరెంట్ బిల్లు మాఫీ చేయాలని, ఉచిత కరెంటు అందించాలని ఆయన కోరారు. కరోనా వైరస్ సందర్భంగా, ప్రభుత్వ సంస్థలు, ఆసుపత్రులు, పోలీస్, గురుకుల మోడల్ స్కూల్, బట్టల శుభ్రత, రజకులకు ఇవ్వాలని అన్నారు.
నూతన దోబీఘాట్ నిర్మాణాలు చేపట్టాలని యాంత్రీకరణ నిర్మాణాల పనులు వెంటనే పునరుద్ధరించాలని ఆయన అన్నారు. గత 190 జీవో ప్రకారం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రుణాలు మంజూరు చేసి రజక వృత్తిదారుల ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం మండల నాయకులు సురేందర్ జల్లాపురం, రాము, శివ, తదితరులు పాల్గొన్నారు.