రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల గోస వినిపించడం లేదని, ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి ధాన్యానికి తక్షణమే డబ్బులు చెల్లించాలని నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. నేడు పెర్కిట్ లోని బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి ఇంటి వద్ద పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో గంగారెడ్డి మాట్లాడుతూ రైతులు మక్కలు, వరిధాన్యం అమ్మకాలలో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మక్కలు కొనుగోలు ప్రారంభించి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు డబ్బులు రాకపోవడం, మరి కొంతమంది రైతుల నుంచి కొనుగోలు జరపకపోవడం అన్యాయమని ఆయన అన్నారు.
రైతుకు డబ్బులు ఇవ్వకపోతే ఎలా?
ఇప్పటి వరకు 86 వేల మెట్రిక్ టన్నులకు గాను 80 వేలు కొనుగోలు చేశారని అయితే కేవలం 27 వేల మెట్రిక్ టన్నులకే డబ్బులు చెల్లిచారని అన్నారు. ఇంకా 54 వేల మెట్రిక్ టన్నుల డబ్బులు రైతులకు చేరాల్సి ఉందని ఆయన అన్నారు. డబ్బులు రాకపోవడంతో రైతులు వచ్చే జూన్ నుండి వర్షాకాలపు పంట వేసుకోవడానికి సాగు చేసుకునే సమయం దాటి పోతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అదే విధంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకువచ్చి నెల గడుస్తున్నా ఇప్పటివరకు మూడు లక్షల 20 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని ఆయన తెలిపారు. ఇంకా రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయవలసి ఉందని, 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దే ఉండిపోయిందని అన్నారు. మొత్తం ఇప్పటి వరకు 618 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి ఉండగా కేవలం 190 కోట్లు మాత్రమే రైతులకు చెల్లించారని అన్నారు.
సమస్య పరిష్కారమయ్యే వరకూ వత్తిడి తెస్తాం
తమ డిమాండ్ కు ప్రభుత్వం స్పందించకుంటే భారతీయ జనతాపార్టీ రైతుల సమస్య పరిష్కారమయ్యే వరకు ఒత్తిడి తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రోహిత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు పాలెపు రాజు గోవింద్ పేట్ గ్రామ ఎంపిటిసి రాజ్ కుమార్ ఆర్ ఎం పి టి సి నరసయ్య అన్నారం ఎంపీటీసీ సంజీవ్ సాయి కుమార్ కౌన్సిలర్ రాజేందర్ ఆర్మూరు మండల బిజెపి వైస్ ప్రెసిడెంట్ నరేష్ చారి మండల ప్రెసిడెంట్ ప్రశాంత్ బీజేవైఎం టౌన్ ప్రెసిడెంట్ ప్రణయ్ ఉన్నారు.