సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓల్డ్ సఫిల్ గూడ లోని పి.బి.డి.ఏ.వి మోడల్ స్కూల్ టీచర్లు గత ఆరు నెలలనుండి జీతాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. పి.బి.డి.ఏ.వి స్కూలు, డి .ఏ .వి. సెంట్రల్ మేనేజ్ మెంట్ కమిటీ – న్యూ ఢిల్లీ ఆధ్వర్యాన నడుస్తుంది.
2003 లో స్థాపించిన ఈ స్కూల్ నేడు ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో మంచి పేరు సంపాదించుకున్నది. ఇటీవల కోవిడ్ మహమ్మారి కారణంగా సెలవులు ప్రకటించిన నేపధ్యంలో అందులో పనిచేస్తున్న టీచర్లు మాత్రం మే నెల మూడవ వారం నుండే విద్యార్థులకు ఇంటినుండి ఆన్ లైన్ తరగతులు తీసుకుంటున్నారు.
స్కూలు విద్యార్థులు ఇప్పటివరకు ఫీజులు చెల్లించడం లేదన్న వంకతో వారికి జీతాలు ఇవ్వడంలేదు. ఇదిగాక బడ్జెట్ సమస్యల వల్ల ఢిల్లీ మేనేజింగ్ కమిటీ నుండి స్కూల్ కు రావాల్సిన ఫండ్స్ విడుదల కావడంలేదని గత ఏడు మాసాలుగా టీచర్లకు జీతాలు ఇవ్వకపోవడం శోచనీయం.
ఈ మధ్యలో స్కూల్ ప్రధానాధికారి దీర్ఘకాలిక సెలవు పై వెళ్లడం వల్ల ఈ సమస్యను పట్టించుకునే నాథుడే లేడు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులెవరూ సమస్యను పరిష్కరించలేక పోవటం , ఢిల్లీ ఉన్నతాధికారులకు ఈ సమాచారం అందింది లేదో అన్న అయోమయంలో టీచర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
గత 17 సంవత్సరాలుగా ఈ స్కూల్ నే అంటిపెట్టు కొని ఎంతో శ్రమించి పనిచేస్తున్న టీచర్లు ఇప్పటికిప్పుడు వేరే ఉద్యోగాలు చూసుకోలేరు. ఇన్ని ఇబ్బందులు ఓర్చుకుంటూ కూడా అకెడమిక్ కాలెండరు కు విఘాతం కలగకుండా తమ విద్యార్థుల భవిష్యత్తును దృషిలో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించక పోతే టీచర్ల జీవితాలు అధోగతి పాలు కావాల్సిందే ! పడవ పూర్తిగా మునగక ముందే ఒడ్డుకు చేరుతుందని టీచర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.