ఓటుకు నోటు కేసు మాదిరిగానే టీపీసీసీ పదవిని అమ్ముకున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవుల మీ ప్రేమ ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేసే వాడిని కాదన్నారు. నేడు ఢిల్లీ నుంచి వచ్చి శంషాబాద్ ఎయిర్ పోర్టులో విలేఖరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా 30 ఏళ్లుగా పార్టీకోసం ప్రజలు, కార్యకర్తల మధ్య ఉండి పనిచేశా కాబట్టి పీసీసీ ఇస్తారని అనుకున్నానని తెలిపారు. పదవుల మీద మమకారం లేదని కానీ పార్టీ కార్యకర్తగా గుర్తింపు ఇస్తారనుకున్నానని వివరించారు. కానీ రాష్ట్రానికి కొత్తగా వచ్చిన ఇంఛార్జీ చేసిన రాజకీయాల వల్ల తనకు రాలేదని తెలిపారు. పీసీసీ రాకపోవడం కొంచెం బాధగా ఉన్న ప్రజల అభిమానమే నాకు పెద్ద పదవి అని స్పష్టం చేశారు.
గంటకో పార్టీ మార్చే నాయకులను సహించేది లేదు. తమిళనాడులో సీట్లు అమ్ముకున్న మాదిరిగా రాష్ట్ర ఇంఛార్జీ పదవులను అమ్మకున్నారని వెల్లడించారు. ఓటుకు నోటు కేసు మాదిరి నేతలు అమ్ముడుపోయారని దుయ్యబట్టారు. తనకు అన్యాయం జరగలేదు లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగిందన్నారు. పార్టీలు మారిన వారికి పీసీసీ కట్టబెట్టారని మండిపడ్డారు. తనను కలవడానికి కొత్తగా నియమితులైన పీసీసీ కమిటీ రావద్దని తెలిపారు.
పదవులతో సంబంధం లేకుండా ప్రజలకు, కార్యకర్తలకు అండగా ఉండడమే తన లక్ష్యమన్నారు. ప్రజలే కుటుంబంగా… కార్యకర్తలే ప్రాణంగా బతికిన వాన్ని అలాగే చివరి క్షణం వరకు ప్రజల కోసమే ఉంటానని వెల్లడించారు. పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి పార్లమెంట్లో గళమెత్తుతానని వివరించారు. ఇప్పటి వరకు ఎలా పని చేశానో ఇప్పుడు కూడా అలాగే పార్టీ కోసం పనిచేస్తానని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో ఉంటే కోమటిరెడ్డికి అన్యాయం జరిగింది మనకు అన్యాయం చేస్తారని కార్యకర్తలు అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి రేపటి నుంచి భువనగిరి పార్లమెంట్ పరిథిలోని 7 స్థానాలు, నల్గొండ పార్లమెంట్ పరిధిలోని 7స్థానాల్లో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. 14 అసెంబ్లీ స్థానాలు గెలిచే బాధ్యత తనదేనని తెలిపారు. నా రాజకీయ భవిష్యత్ కార్యాచరణ నా చేతులో లేదు.. కార్యకర్తలు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.