కరడు గట్టిన అంతర్ రాష్ట్ర ఎర్ర చందనం స్మగ్లర్లు ఆర్.భాస్కరన్ పై పి.డి.చట్టం ప్రయోగించారు. 2016 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కడప జిల్లాలో ఆర్.భాస్కరన్ పై 29 కేసులు నమోదయ్యాయి.
ఇతను గత ఆరు సంవత్సరాలుగా ఎర్ర చందనం దుంగల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. ఇతను షిప్ కంటైనర్ ద్వారా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నాడని Directorate of Revenue Intelligence, (D.R.I.), Chennai లో ఇతని పై మూడు కేసులు నమోదు చేసింది.
ఇతనికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అనేక మంది అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలున్నాయి.
ఇతను తమిళనాడు రాష్ట్రం నుండి కూలీలను తీసుకుని వచ్చి జిల్లాలోని అట్లూరు, గువ్వలచెరువు ఘాట్, వీరబల్లి, సుండుపల్లి ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో దుంగలను నరికించి వాటిని దుంగ లుగా చేయించి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు అక్రమ రవాణా చేసి అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లకు విక్రయించి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నాడు.
కడప జిల్లా ఎస్.పి కే.కే.ఎన్.అన్బురాజన్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (OSD) M.దేవ ప్రసాద్ పర్యవేక్షణలో కడప జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ పి.డి చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులను జారీ చేయమని ప్రతిపాదనలు సమర్పించారు.
దాని మేరకు నిన్న పి.డి చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులను జారీ చేశారు. ఎర్ర చందనం అక్రమ రవాణా, ఎర్ర చందనం రవాణాకు సహకరించిన వారి పై కఠిన చర్యలు ఉంటాయి అని ఎస్పీ చెప్పారు.