రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ప్రాజెక్టుల మరమ్మత్తుల కోసం అదనపు నిధులు కేటాయిస్తోందని, ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 28.18 కోట్ల వ్యయంతో ఏపీలోని విజయనగరం జిల్లాలో పాచిపెంట మండలం పరిధిలోని పెద్దగెడ్డ ఆధునికీకరణ పనులకు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభోత్సం చేశారు.
ముందుగా పెద్దగెడ్డ ప్రధాన కుడి కాలువ ఆరో కిలోమీటరు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గురువునాయుడు పేటలో ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. జిల్లా రైతాంగం సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటుందని, అదనపు నిధులు కేటాయిస్తోందని పేర్కొన్నారు. తోటపల్లి, పెద్దగెడ్డ, వెంగళరాయ సాగర్ ప్రాజెక్టుల ఆధునికీకరణతో చివరి ఆయుకట్టు వరకు సాగునీరు అందించవచ్చని తద్వారా వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు సాధ్యమవుతాయని మంత్రి అన్నారు.
28.18 కోట్లతో చేపడుతున్న ఈ పనులు పూర్తయితే సాలూరు నియోజకవర్గ పరిధిలో సుమారు 22వేల ఎకరాలు ఆయుకట్టుకు సాగునీరు పుష్కలంగా అందుతుందన్నారు. నాడు జలయజ్ఞంలో భాగంగా స్వర్గీయ వైఎస్ఆర్ పెద్దగడ్డను నిర్మించారని దానికి నేడు తన సీఎం జగన్ ఆధునికీకరణ పనులు చేపట్టడం హర్షణీయమని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సాలూరు నియోజకవర్గంలోని పాచిపెంట మండలంలో 12 గ్రామాలకు, సాలూరు మండలంలో 7 గ్రామాలకు, రామభద్రపురం మండలంలో మరో 7 గ్రామాలకు సాగునీరు అందుంతుందని వివరించారు.
స్థానిక రైతుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతు ఎప్పుడూ ఒకరికి పెట్టేవాడిలాగే బ్రతకాలి గానీ.. ఒకరి దగ్గర చేయి చాపి బ్రతక కూడదని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా, మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆసరా, చేయూత, అమ్మ ఒడి తదితర పథకాలు అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
ఈ క్రమంలో రాజకీయ విమర్శలు చేసే వారిపై మంత్రి ఘాటుగా స్పందించారు. విమర్శలు చేసేవారు ముందుగా పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను చదువుకోవాలని సూచించారు. మంత్రి ఈ సందర్భంగా పార్టీ మేనిఫెస్టో పత్రాలను చూపించి మాట్లాడారు. నేడు దిగువ స్థాయి నుంచి ఎగువ స్థాయి వరకు అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
ఎవరినీ నమ్మించి మోసం చేసే ఉద్దేశం… దగా చేసే బుద్ది ఈ ప్రభుత్వానికి గానీ.. సీఎం కి గానీ లేవని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం పెద్దలకు పెద్దపీట వేసిందని, ఈ ప్రభుత్వం పేదలకు పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా పరిపాలన గ్రామ స్థాయిలో సులభంగా జరుగుతుందని, ఎన్నో సేవలు క్షేత్రస్థాయిలో లభిస్తున్నాయన్నారు. ఈ క్రమంలో సచివాలయ సిబ్బందిని సభ ముందు నిల్చోబెట్టి వీరంతా మీ గ్రామంలో.. మీ వద్దే.. ఉంటూ సేవలందిస్తారని.. ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనకు… ఇతర ప్రభుత్వాల పాలనకు తేడా అని మంత్రి పేర్కొన్నారు.
జిల్లాల పునర్విభజనతో అభివృద్ధి వికేంద్రీకరణ
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జిల్లాల పునర్విభజన నిర్ణయంతో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని మంత్రి బొత్స పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు జిల్లా కేంద్రాలు దగ్గర అవుతాయని, తద్వారా పరిపాలన సులభం అవుతుందన్నారు.
పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా ఇవ్వటం వల్ల ఎంతో మంది గిరిజనులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాల పెంపు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఒనగూరుతాయని, ఎంతోమంది కలలు నెరవేరుతాయని మంత్రి ఉద్ధాటించారు.అనంతరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదల సంక్షమార్థం ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుందని, దానిలో భాగమే నేడు ప్రాజెక్టులకు ఆధునికీకరణ శ్రీకారం చుట్టడమని పేర్కొన్నారు.
పెద్దగెడ్డ రిజర్వాయర్ ఆధునికీకరణ పనులతో ఈ ప్రాంత ప్రజలకు ఆర్థికంగా బలపడే అవకాశం లభిస్తుందన్నారు. జలయజ్ఞం పథకంలో భాగంగా రాష్ట్రంలోనే మొట్టమొదటగా ప్రారంభమైన ప్రాజెక్టు పెద్దగెడ్డ అని, నేడు ఆ ప్రాజెక్టు ఆధునికీకరణకు నోచుకోవటం నిజంగా హర్షణీయమని అన్నారు. సాలూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజా నాయకుడిగా నిలుస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే రాజన్నదొరను జడ్పీ ఛైర్మన్ ఈ సందర్భంగా కొనియాడారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి, జడ్పీ ఛైర్మన్, ఎమ్మెల్యేలు, జేసీ, పీవో, ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కిషో ర్ కుమార్, ఐటీడీఏ పీవో కూర్మనాథ్, ఇరిగేషన్ సీఈ శంబంగి సుగుణాకర రావు, ఎస్.ఈ. రాంబాబు, డీఈ కనకరావు, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.