రాష్ట్రంలోని పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం, ఎస్పీలు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారుల పని చేయాలన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి చొరవ చూపించి వాటి సంఖ్యను తగించేలా కృషి చేసిన వనపర్తి జిల్లా ఎస్పీ కె.అపూర్వరావుతో పాటు పలు జిల్లాల ఎస్పీలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
జిల్లా ఎస్పీ. కె.అపూర్వరావు మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఫలితంగా పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించగలిగామని తెలిపారు. ఇంకా పెండింగులో ఉన్నకేసులన్నింటిని పరిష్కరించేలా కృషి చేస్తున్నామని ఇందుకోసం కోర్టులలో న్యాయమూర్తులతో చర్చించి కేసుల పురోగతి, విచారణ విషయాలలో అధికారులంతా చురుకుగా పని చేసే విధంగా జిల్లాలో చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ డీజీపీకీ వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ,షాకీర్ హుస్సేన్, వనపర్తి డీఎస్పీ, కెఎం,కిరణ్ కుమార్, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్, జమ్ములప్ప తదితరులున్నారు.