అధికార వైఎస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం పూర్తిగా విఫలం అవుతుందని జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) ద్వజమెత్తారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధి ఏ గడపకు వెళ్ళినా విజయనగరంలో నిలదీయని జనం లేరని, గడప గడపకు వస్తున్న అధికార పార్టీ నాయకులను గడప గడపకు చివాట్లు పెట్టి ప్రజలు వెళ్లగొడుతున్నారని ఆయన అన్నారు.
అధికారం కోసం ఎన్నో మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఈ కార్యక్రమం మొదలు పెట్టినట్టు ఉందని,ఎన్నో హామీలు ఆశ కల్పించి అన్నిటినీ తుంగలోకి తొక్కి పాలిస్తున్న జగన్ రెడ్డిని గద్దె దింపేందుకు సన్నద్ధంగా ఉన్న ప్రజలు ఇంటి ముందుకు ఆయా ప్రజా ప్రతినిధి కనపడగానే ఆ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నరని జనసేన నాయకులు బాలు ద్వజమెత్తారు.
రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన జగన్ ను జనం చీ కొడుతున్నారని, ప్రతిపక్షంలో వున్నప్పుడు నిత్యావసర ధరల కొసం ఎన్నో మాటలు మాట్లాడిన జగన్ అధికారంలోకి వచ్చాక దశలవారీగా సామాన్యులు కొనలేని విధంగా పెంచుతూ పోతున్నారని,రోడ్ల కోసం ఇక చెప్పక్కర్లేదని, రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా అస్తవ్యస్తంగా రోడ్లన్నీ ఉన్నాయన్న సంగతి ప్రజలందరికి తెలుసునని, సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పంచుతున్న డబ్బులకు ఎన్నో రెట్లు పెంచిన పన్నులు,ధరల రూపంలో పిండుకుంటుందని అన్నారు.
కరెంట్ చార్జీలు, బస్ చార్జీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా ప్రజల్ని పీడిస్తూ యువతకు ఉద్యోగాలు ఇస్తానని, ఏడాదికి ఒక జాబ్ కేలండర్ అని నమ్మబలికి అధికారం లోకి వచ్చాక యువతను కనీసం పట్టించుకునే పరిస్థితిలో కూడ ఈ జగన్ ప్రభుత్వం లేదని,ఇవన్నీ ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను పోలీసులను వుసిగొలిపి వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ మూడు సంవత్సరాలలో ఇంత దారుణమైన పరిపాలన ఏ ప్రభుత్వంలోని చూడలేదని అవాక్కవుతున్న ప్రజలే గడప గడపకూ వైయస్ఆర్సీపీ అంటూ వచ్చే వైసీపీ నాయకులను నిలదీయాలని అన్నారు.