పబ్లిక్ లైఫ్ లో ఉన్న వారికి ఈ దశలో కరోనా సోకడం ఆరంభమైనట్లు కనిపిస్తున్నది. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్ కు కరోనా సోకిందనే వార్త వచ్చి ఒక్క రోజు కూడా గడవక ముందే ఈరోజు మరో వార్త షాక్ ఇస్తున్నది. రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు స్టాఫ్ లో ఒకరికి కరోనా అనుమానిత లక్షణాలు కనిపించినట్లు చెబుతున్నారు. సిద్ది పేటలో ఉండే అతనికి జ్వర లక్షణాలు కనిపించడంతో ఆరోగ్య సిబ్బంది అప్రమత్తమయ్యారు.
లాక్ డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ప్రతిరోజు దాదాపు 200 కొత్త కేసులతో కలకలం రేపుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాలలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మరోవైపు ప్రజాప్రతినిధుల వద్ద పని చేస్తున్న సిబ్బందికి కూడా కరోనా సోకుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కట్టుదిట్టమైన కార్యాచరణ రూపొందిస్తోంది.