నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గంలోని చిట్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమని మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్ రెడ్డి అన్నారు. పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను శుక్రవారం ఆయన పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభానికి ముందే అంటు రోగాలు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
పట్టణంలోని ప్రతి వార్డులో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు మున్సిపాలిటీ చేపడుతున్న కార్యక్రమాలలో ప్రజల చేయూత అవసరమని సూచించారు. ఇంట్లోని చెత్తను తడి, పొడిగా వేరు చేసి మున్సిపాలిటీ చెత్త వాహనం లో వేయాలని కోరారు.
పట్టణ పరిశుభ్రతలో భాగంగా మురికి కాలువల మరమ్మతులు, పిచ్చి మొక్కల తొలగింపు పనులు చేపట్టినట్లు వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కూరేళ్ల లింగస్వామి, కౌన్సిలర్ జమాండ్ల జయమ్మ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు ఎం డి షుకోర్, షేక్ ఫారీద్ తదితరులు పాల్గొన్నారు.