ప్రపంచ వ్యాప్తంగా ప్రజాజీవనాన్ని స్తంభింప చేసి, భయాందోళనలకు గురి చేస్తున్న కరోనా రక్కసిని కట్టడి చేయడంలో ప్రజలదే కీలక పాత్ర అని రాష్ట్ర మంత్రి గుంతకళ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని నకిరేకల్ లో పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కారక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.
కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రభుత్వంతో కలిసి రావాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చారు. ప్రభుత్వాలు చేస్తున్న పోరాటాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని, ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడి వుండాలని ఆయన హితవు పలికారు. మే 7 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్న దరిమిలా ప్రజలు ఇంట్లోనే ఉండాలని, సాంఘిక దూరాన్ని పాటించాలని అన్నారు. ఈ సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిరుమర్తి లింగయ్యతో పాటు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.