ప్రజలంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తున్న ఆదేశాలను పాటించాలని మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జూపల్లి కృష్ణారావు కోరారు. ప్రతి ఒక్కరూ వ్యాధి నిరోధక శక్తి ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలని ఆయన తెలిపారు.
వ్యాధినిరోధక శక్తి ఎంత ఎక్కువ ఉంటే కరోనా వైరస్ అంత దూరంగా పారిపోతుందని జూపల్లి అన్నారు. అదే విధంగా యోగతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని ఆయన తెలిపారు. యోగా వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆయన వెల్లడించారు.
సామాజిక దూరం పాటించడం, రోడ్లపై తిరగ కుండా ఉండటం తదితర చర్యలలో కరోనాను పారద్రోలవచ్చునని ఆయన అన్నారు. ప్రభుత్వం చెప్పిన పనులు చేయకుండా గాలిలో దీపం పెట్టి ఆరోగ్యం బాగుండాలి అంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు.
శారీరక శ్రమ ఎక్కువ చేసేవారికి కరోనా దూరంగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల కన్నా భారత్ లో కరోనా రోగుల సంఖ్య తక్కువగా ఉందని, ఇదే విధమైన కట్టుబాట్లు పాటిస్తే తర్వలోనే మన దేశం నుంచి కరోనా మహమ్మారి అదృశ్యమైపోతుందని జూపల్లి కృష్ణారావు తెలిపారు.
కొల్లాపూర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణ రావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి హనుమంత్ నాయక్, కౌన్సిలర్ బాల స్వామి, సింగల్ విండో డైరెక్టర్ పసుపుల నరసింహ, మాజీ సర్పంచ్ మేకల నాగరాజు, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఎక్బాల్, యూత్ వింగ్ నాయకులు ధర్మ తేజా తదితరులు పాల్గొన్నారు.