ప్రపంచాన్ని కబళిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చేయడం కోసం ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ కు ప్రజలందరూ సహకరించాలని, ఈ సమయంలో నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి దాతలు కూడా తోడవ్వాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.
గురువారం ఖమ్మం గ్రైన్ మార్కెట్ ప్రాంగణంలో టిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం నాయకుడు నున్నా మాధవరావు ఆధ్వర్యంలో 400 మంది మార్కెట్ ఎడ్లబండి, ట్రాలీ కార్మికులకు 100 క్వింటాల్ బియ్యం, మంచినూనే, ఇతర నిత్యావసర వస్తువులను మంత్రి పంపిణి చేశారు.
ప్రస్తుత తరుణంలో విశ్వ వ్యాప్తంగా కరోనా వైరస్ సమస్య ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్లో ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికులు పస్తులు ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో రేషన్ కార్డున్న నిరుపేదలకు 12 కిలోల రేషన్, 1500 రూపాయలు ఇస్తుంటే… రేషన్ కార్డు లేని నిరుపేదలకు 12 కిలోల రేషన్, 500 రూపాయలను ఇస్తోందని చెప్పారు.
దీనికి తోడు అనేక మంది దాతలు కూడా నేడు ఆదుకునేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. లాక్ డౌన్ మే నెల 3వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో అందరూ సామాజిక దూరం, పరిశుభ్రత పాటిస్తూ ఇళ్లలోనే ఉంటూ సహకరించాలని కోరారు.
ఈరోజు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వంతో పాటుగా దాతలు నిరుపేదలకు వీలైనంత సాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు పాల్గొన్నారు. ఇంకా మిర్చిశాఖ నాయకులు మాటేటి నాగేశ్వరరావు, మెంతుల శ్రీశైలం, వేములపల్లి వెంకటేశ్వరరావు, ట్రాలీ అసోషియేష్ నాయకులు ఎర్ర రామిరెడ్డి, సాదే రామయ్య, సారంగి వెంకటప్పయ్య, తదితరులు కూడా పాల్గొన్నారు.