మధ్యతరగతిపై పిడుగు: మారని ఆదాయపు పన్ను శ్లాబ్ లు వ్యక్తిగత ఆదాయపు పన్ను కేటగిరీలో ఆదాయపు పన్ను శ్లాబ్లలో ఎలాంటి మార్పు లేదు. కరోనా నేపథ్యంలో కొంతైనా వెసులుబాటు కలుగుతుందని ఆశించిన మధ్య తరగతి పన్ను చెల్లింపుదారుల ఆశలను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వమ్ము చేశారు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను యథాతధంగా ఉంచారు. మధ్యతరగతిపై మహమ్మారి ప్రభావం దృష్ట్యా పరిమితి పెంచుతారనుకున్న స్టాండర్డ్ డిడక్షన్ను కూడా మంత్రి పెంచలేదు. అధిక ద్రవ్యోల్బణం స్థాయిని దృష్టిలో ఉంచుకుని కొంతైనా వెసులుబాటు కలుగుతుందని భావించిన మధ్యతరగతి వర్గాలు కేంద్ర బడ్జెట్ చూసి నిరాశలో మునిగిపోయాయి.