లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ ఎమ్మెల్యేలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే సీబీఐతో విచారణ జరిపించాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖిలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు కొన్ని కార్యక్రమాలు నిర్వహించారని ప్రభుత్వ తరపు లాయర్ హైకోర్టుకు తెలిపారు.
ప్రజాప్రతినిధులే లాక్ డౌన్ నిబంధనలు పాటించకపోతే ఎలా అని హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి జన సమూహాలతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిపై హైకోర్టులో న్యాయవాది ఇంద్రనీల్ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు లాక్డౌన్ ఉల్లంఘనలకు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారంపై సీబీఐ విచారణ ఎందుకు ఆదేశించకూడదని ప్రశ్నించింది. లాక్డౌన్ నిబంధనలు ప్రజాప్రతినిధులుగా అమలుచేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తరపు వివరాలు అందజేసేందుకు అడ్వకేట్ జనరల్ సమయం కోరారు.
దాంతో ఈ కేసు తదుపరి విచారణను ధర్మాసనం వచ్చే వారానికి వాయిదా వేసింది. ఇప్పటికే ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ హైకోర్టులో ఫిటిషన్లు దాకలు కాగా తాజా పిటిషన్తో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరింది.