భారత్ బయోటెక్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ‘కోవాక్సిన్’ సామర్ధ్యంపై అనుమానాలను నివృత్తి చేసుకోకుండానే భారత ఔషధ నియంత్రణ అధికారులు అనుమతులు మంజూరు చేశారని ఆరోపిస్తూ బొంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
సాకేత్ గోఖలే అనే సమాజ సేవకుడు ఈ పిటిషన్ దాఖలు చేశారు. దేశ వ్యాప్తంగా నేటి నుంచి కరోనా వ్యాక్సిన్ ఆరోగ్య కార్యకర్తలకు సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే హడావుడిగా మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే అనుమతులు మంజూరు చేశారని పిటిషనర్ ఆరోపించారు.
భారత్ బయో టెక్ వారి కోవ్యాక్సిన్ భద్రత ఎంత అనే అంశం ధృవీకరించుకోకుండానే అనుమతులు మంజూరు చేయడం తీవ్ర అభ్యంతరకరమని, ఇది దేశ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటమేనని ఆయన పేర్కొన్నారు. అనుమతుల కోసం భారత్ బయోటెక్ సంస్థ వారు ప్రభుత్వానికి సమర్పించిన పరిశోధనా ఫలితాలను దేశ ప్రజలకు అందుబాటులో ఉంచలేదని ఆయన అన్నారు.
జనవరి 3వ తేదీన ఔషధ నియంత్రణ అధికారులు ఇచ్చిన అనుమతిలో ‘‘అత్యవసర పరిస్థితుల్లో పరిమిత వినియోగానికి’’ మాత్రమే అనుమతులు ఇస్తున్నట్లు పేర్కొన్నారని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల కోవ్యాక్సిన్ కు పూర్తి స్థాయి అనుమతి రానట్లుగానే భావించాల్సి ఉంటుందని, ఈ దశలో పెద్ద ఎత్తున ప్రజలకు పంపిణీ చేయడం శ్రేయస్కరం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో ఒక వ్యక్తి హుద్రోగంతో మరణించాడని కూడా ఆయన కోర్టుకు తెలిపారు. అందువల్ల తాను అత్యవసర పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు పిటిషనర్ పేర్కొన్నాడు.