గత రెండు రోజులుగా ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం సర్వీసులు పనిచేయడం లేదు. సర్వర్ బిజీ అంటూ మొరాయిస్తుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆన్లైన్ పేమెంట్ ట్రాన్సాక్షన్లకు అలవాటు పడిన వినియోగదారులు ప్రతి చిన్నదానికి పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే లను వినియోగిస్తున్నారు. అయితే రెండు రోజులుగా సంబంధిత ఆన్లైన్ పేమెంట్ యాప్స్ పని చేయకపోవడంతో ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.
ఆన్లైన్ పేమెంట్స్ కు అలవాటు పడిన ప్రజలు 10 రూపాయలు కూడా ఫోన్ పే ద్వారానే చెల్లిస్తున్నారు. జేబులో చిల్లి గవ్వ లేకున్నా అకౌంట్ లో డబ్బులు ఉన్నాయన్న ధీమాతో బయటకు వెళ్తున్నారు. ఎక్కడికక్కడ ఆన్లైన్ పేమెంట్స్ చేస్తూ డబ్బులు చెల్లిస్తున్నారు. దాంతో పనులు కూడా ఎక్కడా ఆగకుండా చకచకా సాగిపోతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడం, షాపింగులు, ఇతరత్రా కార్యక్రమాలకు వెళ్తున్న ప్రజలు పెద్ద మొత్తంలో వెంట డబ్బులు తీసుకెళ్లడానికి భయపడుతున్నారు.
పట్టణాల్లో షాపింగ్స్ వల్ల చోరీలు జరిగే అవకాశం ఉండటంతో ఎక్కడికక్కడ పేమెంట్స్ అన్ని ఆన్లైన్ ద్వారానే చేస్తున్నారు. పైగా బ్యాంక్, ఏటీఎంలకు వెళ్లి గంటల కొద్దీ క్యూ లైన్ లో నిలబడే పరిస్థితి లేదు. ఏటీఎంలలో సైతం మూడుసార్లు మాత్రమే కార్డు ఉపయోగించాల్సి రావడం, కేవలం 20 వేలు మాత్రమే డ్రా చేసుకునే అవకాశం ఉండటం కూడా ఆన్లైన్ పేమెంట్ కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రస్తుతం రెండు రోజులుగా ఆన్లైన్ పేమెంట్ సర్వీసులు నిలిచిపోవడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఏటీఎం, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్లైన్ సర్వీసులలో ఏర్పడిన ఇబ్బందులను త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.