భారతదేశంలో అనేక కట్టుబాట్ల పేరుతో మహిళలపై ఆంక్షలున్నరోజుల్లో సావిత్రిబాయ్ పూలే సాహసోపేతమైన నిర్ణయంతో అనేక మంది మహిళల జీవితాల్లో వెలుగు తీసుకువచ్చారని, అంతేగాకుండా ఉత్తమ విద్యార్థులను రూపొందించడంలో ఆమె పాత్ర ఎనలేనిదని, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఆమె సేవలు గర్వించదగ్గవని మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. నియోజకవర్గంలోని ఆయా చోట్ల పలు అధికారిక కార్యక్రమాల్లో ఆదివారం పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి సావిత్రిభాయీ ఫూలే జయంతి సందర్భంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. సావిత్రిభాయీ ఫూలే అనేక అవమానాలు భరించి, అనేక అవరోధాలను దైర్యంగా ఎదుర్కొని మహిళల్లో చైతన్యం కలిగేలా, వారికి విద్య నేర్పించిన చదువుల తల్లీ అని కొనియాడారు. అంతేగాకుండా మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయీ పూలే అని, ఆమె బాటలో తెలంగాణ రాష్ర్టం పయనిస్తోందని, ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల అభ్యున్నతి కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని, బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారని మంత్రి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే గురుకుల పాఠశాలలు, కళాశాలాల స్థాపన, కేజీ టూ పీజీ విద్యతో ఫూలే ఆశయాలను కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. తెలంగాణా ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం, రాష్ర్ట భవిష్యత్ కోసం పాటుపడుతోందని స్పష్టం చేశారు. ప్రతి పేద బిడ్డలు పెద్ద పెద్ద చదువులు చదివి ఉన్నత స్థానాల్లోకి వచ్చినప్పుడే సావిత్రి బాయీ పూలేకి నిజమైన నివాళి అని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
మాజీ కార్పొరేటర్ అనితా దయాకర్రెడ్డి, బేర బాలకిషన్ (బాలన్న), ఆకుల అరవింద్ కుమార్. బోయిని మహేందర్ యాదవ్, దర్పల్లి అశోక్, లోక సాని కొండలరెడ్డి, సిరిపురం రాజేష్ గౌడ్, కేశవరెడ్డి శేఖర్ రెడ్డి, సలీం, కట్టా ప్రవీణ్, సిలివేరు వెంకట్ గౌడ్, లొడి నర్సిమ్మ గౌడ్, జిల్లెల కృష్ణారెడ్డి, షాబాద్ రవీందర్ రెడ్డి, పందుల రాజు, రిషి కందుల రాము తదితరులు పాల్గొన్నారు.