ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి మహాసమ్మేళనంగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. వాస్తవంగా జాతరకు ఇంకా నెల రోజులు సమయం ఉంది. జాతర సమయంలో రద్దీ, కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా చాలా మంది భక్తులు ముందుగానే అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతి సెలవులు కలిసి రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు మేడారం చేరుకొని గంటల తరబడి క్యూలో వేచి ఉండి కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కుటుంబ సమేతంగా పసుపు, కుంకుమలతో వన దేవతలకు పూజలు చేసి బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో మేడారం పరిసరాలు రద్దీగా మారుతున్నాయి. దర్శనాల అనంతరం పరిసర ప్రాంతాల్లో వంటలు చేసుకుంటున్నారు. మరోవైపు కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. భక్తులు నిబంధనలు పాటించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని క్యూ లైన్లు పెంచడం సహా భక్తులు ఎక్కువసేపు క్యూలో ఉంచకుండా త్వరగా అమ్మవార్ల దర్శనం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
2022 జాతర ముఖ్యఘట్టాలు ఇవి:
ఫిబ్రవరి 16 – సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులును గద్దెల వద్దకు తీసుకొస్తారు.
17 – చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దెల వద్దకు చేరుస్తారు.
18 – సమ్మక్క-సారక్క అమ్మవార్లకు ప్రజలు మొక్కులు సమర్పించుకోవడం.
19 – వన ప్రవేశం, మహా జాతర ముగింపు.