ఆలయ సాంప్రదాయాలకు విరుద్ధంగా జరిగే తప్పులను శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తే అత్యుత్సాహంతో తప్పుడు కేసులు పెట్టే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పింక్ డైమండ్ విషయం పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు ఎవరి మీద కేసులు పెడతారో చెప్పాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
తిరుపతి కోర్టులో ఫీజు రూపంలో కట్టిన వడ్డీకాసులవాడి “2 కోట్ల” సొమ్ముకు జవాబుదారీ ఎవరో, ఎవరి నుంచి పరువు నష్టం సొమ్ము రికవరీ చేస్తారో భక్తులకు సమాధానం చెప్పాలని ఆయన కోరారు. తిరుమల శ్రీవారికి”పింక్ డైమండ్” లేదు దానిపై విచారణ అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసిందని ఆయన వివరించారు.
శ్రీవారి పింక్ డైమండ్ పై వాస్తవాలు భక్తులకు తెలియాలని ఓ భక్తుడు హైకోర్టును ఆశ్రయించగా గతంలో జస్టిస్ జగన్నాథరావు, వాఘ్వా కమిటీ పింక్ డైమండ్ అనేది లేదు అని స్పష్టంగా తెలిపినందున దానిపై మళ్లీ విచారణ అవసరం లేదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ తరహాలో జెనీవాలో వేలం వేస్తున్నట్లు తెలిసిందని మాజీ ప్రధాన అర్చకులు చెప్పగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు ఇంట్లో ఉన్నట్లు తెలుస్తుంది అధికారులు వెంటనే సోదాలు చేస్తే ఖండాంతరాలు దాటిపోకుండా పింక్ డైమండ్ దొరుకుతుంది అని వైకాపా నాయకులు విజయసాయిరెడ్డి బహిరంగ ప్రకటన చేశారు.
దీంతో టీటీడీ కి 200 కోట్ల పరువునష్టం జరిగిందని అప్పటి ధర్మకర్తల మండలి,ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి X ADJ కోర్టులో OS/0000264/2018 కేసు వేసి “2 కోట్లు” శ్రీవారి నిధులను కోర్టు ఫీజు కింద కోర్టులో జమ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ పి. అరుప్ కుమార్ గోస్వామి, జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ తీర్పు నేపథ్యంలో పింక్ డైమండ్ అనేది లేదు అని తేలింది
మరి పింక్ డైమండ్ వున్నట్లు ప్రచారం చేసిన వారిపై టీటీడీ ప్రస్తుత ధర్మకర్తల మండలి ఈవో చట్ట పరంగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు భక్తులకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.