యాసంగిలో వేసే పంటకు ఇరిగేషన్ శాఖ ఇచ్చిన తైబందీ ప్రకారమే సాగు చేయాలని, రైతులు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని ఆశాఖ డీఈ ఆమ్రపాళి సూచించారు.
మంగళవారం ములుగు శివారులోని లోకం చెరువు ప్రధాన పంట కాలువను రైతులతో కలిసి పరిశీలించారు. చెరువులో ప్రస్తుతం 23ఫీట్ల మేర నీటిమట్టం ఉండగా కాలువ ద్వారా 300ల ఎకరాల ఆయకట్టు సాగుకు అధికారులు తైబందీ ప్రకటించారు.
అయితే కొంతమంది రైతులు తైబందీ లేనిచోట సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా రైతుల ఫిర్యాదుతో డీఈ సందర్శించారు. కాలువకు ఉన్న గండ్లను వెంటనే పూడ్చేవిధంగా జేసీబీతో పనులు చేయించారు.
తైబందీలో సాగుచేసే రైతులకు పూర్తిస్థాయిలో నీరు అందేలా చర్యలు తీసుకుంటామని, ఎవరు కూడా కాలువకు గండ్లు పెట్టొద్దని సూచించారు.
ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామన్నారు. డీఈ వెంట పీఏసీఎస్ డైరెక్టర్ బైకాని సాగర్, రైతులు గొర్రె అంకూస్, ఒజ్జల లింగన్న,
నన్నెబోయిన లింగన్న, ఓదెల రమేష్, గై గోపి, కొత్తకొండ రమేష్, గంధం యుగేందర్, భూషబోయిన రమేష్, బైకాని చందర్, ఇమ్మడి నాగరాజు, తదితరులు ఉన్నారు.