ఖమ్మం నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నగర అభివృద్ధిని క్షేత్ర స్థాయిలో పరిశీలనకు వచ్చిన నిజామాబాద్ జిల్లా బృందంతో మునిసిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో కలెక్టర్ నగర అభివృద్ధి గురించి వివరించారు. ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీల అమలుతో నగర రూపురేఖలు మారాయన్నారు. ఒకప్పుడు దుర్గంధభరితంగా, అపరిశుభ్రంగా వున్న గోళ్లపాడు ఛానల్, ఇప్పుడు ఆధునికీకరణ, సుందరీకరణ పనుల పూర్తితో అండర్ గ్రౌండ్ డ్రైనేజి, పార్కులతో ఆహ్లాదకర ప్రాంతంగా మారిందన్నారు. ప్రజల అవసరాలు, సౌకర్యాలు గుర్తెరిగి, తదనుగుణంగా పనులు చేపట్టినట్లు ఆయన అన్నారు. లకారం పార్క్, వైకుంఠదామాలు, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు, ఫుట్ పాత్ లు, ప్రతి డివిజన్ లో పార్కులు, పార్కుల్లో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, మొక్కలతో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పాలనా పరంగా ఆన్లైన్ ద్వారా వేగంగా సేవలు అందిస్తున్నట్లు ఆయన అన్నారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ప్రారంభోత్సవ సందర్భంలో ముఖ్యమంత్రి నిజామాబాద్ కార్పొరేషన్ కి రూ. 100 కోట్లు అభివృద్ధి పనులకు మంజూరు చేసినట్లు, ఇటీవల కార్పొరేషన్ అభివృద్ధి సమీక్ష సందర్భంగా ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి రావాల్సిందిగా ఆదేశించారన్నారు. అట్టి ఆదేశాల మేరకు ఖమ్మం నగరానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఖమ్మం నగరంలో ప్రజలకు ఉపయోగపడే చాలా మంచి పనులు జరిగినట్లు ఆయన అన్నారు. లకారం చాలా సుందరంగా ఉన్నట్లు, గోళ్లపాడు ఛానల్ అభివృద్ధి చాలా అద్భుతం అని ఆయన తెలిపారు. ఇక్కడి క్షేత్ర పరిశీలనను చూశాక, నిజామాబాద్ నగర ప్రజలకు అవసరాలకు తగ్గట్టు, ముఖ్యమంత్రి ఇచ్చిన రూ. 100 కోట్లు ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టనున్నట్లు ఆయన అన్నారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ, ప్రభుత్వం పట్టణాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. ప్రజల అవసరాలకు మార్కెట్లు, వైకుంఠదామాలు, పార్కులు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఇంకా ఎం అభివృద్ధి చేయాలని ఒక ఎడ్యుకేషన్ టూర్ లా ఖమ్మం నకు వచ్చినట్లు తెలిపారు. తాను 2017 లో ఖమ్మం వచ్చినట్లు, అప్పటి ఖమ్మం కు ఇప్పటి ఖమ్మం కు చాలా తేడా ఉన్నట్లు ఆయన అన్నారు. ఐటి హబ్, మార్కెట్లు, సుడా పార్క్, బస్ స్టాండ్, గోళ్లపాడు ఛానల్, టెక్నాలజీ వాడడం చాలా అభివృద్ధి చెందిందని అన్నారు. నగర అభివృద్ధిని క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చిన నిజామాబాద్ జిల్లా బృందానికి మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా నగరంలో చేపట్టిన పనుల గురించి వివరించారు.