భావితరాలు మనుగడ సాధించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలను నాటి సంరక్షించాలని జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు బీబీ పాటిల్ అన్నారు. పిట్లం మండలం మంగలూరు లో ఆరో విడత హరితహారంలో భాగంగా శుక్రవారం ఆయన మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరై మొక్కలు నాటారు.
ప్రతి ఒక్కరూ తమ వంతు సామాజిక బాధ్యతగా మొక్కలను సంరక్షణ చేపట్టాలని సూచించారు. వృక్షాలు లేకపోతే సమస్త జీవరాశులకు మనుగడ లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు విడతల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు.
జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు హనుమంత్ షిండే మొక్కలు నాటారు. వృక్షాలు లేకపోతే భావితరాలు ప్రాణవాయువును కొనుగోలు చేసే పరిస్థితి వచ్చే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందని అన్నారు.
పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకాన్ని చేపట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ మాట్లాడుతూ అడవులను సంరక్షించడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు వర్షాలు కురిసే వీలుందని పేర్కొన్నారు. వాతావరణ సమతుల్యతను కాపాడడానికి వృక్షాలు దోహదపడతాయని చెప్పారు.
ప్రజలు విరివిగా మొక్కలు నాటి భవిష్యత్తు తరాలకు పచ్చదనాన్ని కానుకగా అందించాలని సూచించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దఫేదార్ శోభారాజు పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా అటవీ అధికారి వసంత, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.