వాతావరణం సమతుల్యంగా ఉండటానికి మొక్కలను విరివిగా నాటాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం కట్టంగూర్ మండలం పామనగుళ్ల గ్రామంలో గురువారం 6వ విడత హరిత హారం కార్యక్రమాన్ని శాసనసభ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యా సాగర్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కల పెంపకానికి హరితహారం కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లాలో అటవీ ప్రాంతం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో మొక్కల పెంపకం సామాజిక బాధ్యత గా తీసుకోవాలని సూచించారు.
కావాల్సిన చెట్లు లేకుంటే భవిష్యత్తులో గాలిని కొనుగోలు చేయాల్సి వస్తుందని అన్నారు. ఇంటికొక మొక్కను ప్రతి ఒక్కరు నాటాలని, దానిని చెట్టుగా మరల్చే భాధ్యతను వారు తీసుకోవాలని సుఖేందర్ రెడ్డి కోరారు.