కరోనా పట్ల ఎలాంటి ఆందోళన చెందవద్దని, మనోధైర్యంతో ఉండాలని వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులతో నేడు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉంది, సమయానికి మందులు వేసుకుంటున్నారా? అని బాధితునికి స్వయంగా ఫోన్ చేసి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
హోంక్వారంటైన్ లో ఉన్నవారు 17 రోజుల వరకు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు తప్పకుండా ధరించి ఇంట్లో ప్రత్యేక గదిలో ఉండాలని సూచించారు. పాజిటివ్ గా నిర్ధారణ అయి ఎలాంటి లక్షణాలు లేని వారు ఇంట్లో ఉండడానికి సౌకర్యాలు లేని పేదవారు నర్సంపేటలోని ఐసోలేషన్ కేంద్రానికి వచ్చి ఉండొచ్చు అని తెలిపారు.
వేడినీళ్లు, రెండుపూటల కషాయం, రుచికరమైన భోజన సౌకర్యంతో పాటు వైద్యుల పర్యవేక్షణ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఎంత మందికైనా ఐసోలేషన్ కేంద్రంలో సౌకర్యాలు కల్పిస్తామని, వీలైతే మరో 200 పడకలతో అదనంగా మరొక ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటుచేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా 1035 మంది కరోనా నుండి కోలుకున్నారని ఆయన తెలిపారు. త్వరలో ప్లాస్మా దాన శిబిరాన్ని కూడా త్వరలో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలియచేశారు. ప్లాస్మా దానంపై నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కల్పించాలని నిర్ణయించారు.