తిరుపతి నగరంలో ప్రతి నిత్యం పెరుగుతున్న కరోనా ఉధృతిని దృష్టిలో పెట్టుకొని మద్యం షాపులను పూర్తిగా మూసి వేసేలా చర్యలు చేపట్టాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
తిరుపతి నగరంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది ప్రభుత్వ ఆసుపత్రిలతో పాటు ప్రైవేటు ఆస్పత్రులలో బెడ్ల కొరత కారణంగా నగర ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దినదినగండంగా ఆస్పత్రుల వైపు పరుగులు తీస్తున్నారని ఆయన అన్నారు.
కరోనా కష్టకాలంలో టీటీడీ ఉదారంగా ముందుకొచ్చి శ్రీవారి నిధులతో ఎస్వీ యూనివర్సిటీ స్టేడియం తో పాటు ఇతర మైదానాలలో భారీ టెంట్లు వేసి వెయ్యి పడకలు ఏర్పాటుచేసి ప్రైవేట్ నర్సింగ్ సిబ్బంది ద్వారా కనీసం 500 ప్రాణవాయువు మిషన్లను కొనుగోలు చేసి అభాగ్యుల ప్రాణాలు కాపాడాలని ఆయన కోరారు.
టీటీడీ కి ఎంతోమంది భారీ విరాళాలు ఇచ్చే దాతలున్నారు ధర్మకర్తల మండలి ఐఏఎస్ అధికారులు చొరవ తీసుకొని వారి ద్వారా తిరుపతి నగరంలో కరోనా సోకి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ప్రతి పేద కుటుంబానికి వైరస్ నివారణ మందుల కిట్ అందజేయాలని ఆయన అన్నారు.
తిరుపతిలో వైరస్ వ్యాప్తి చెందకుండా శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష, చాంబర్ ఆఫ్ కామర్స్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి లాక్డౌన్ ప్రకటించడం శుభపరిణామమని అయితే మద్యం షాపులకు కరోనా నిబంధనలు వర్తించవా? అని ఆయన ప్రశ్నించారు.
నిత్యావసర వస్తువుల షాపులు మూసేసి ప్రభుత్వ మద్యం షాపుల తలుపులు తెరిచి లాక్ డౌన్ నిర్వచనమే మార్చారని ఆయన అన్నారు.