రాజకీయాలు పక్కనపెట్టి పేదవాడి ఆకలి తీర్చడానికి తనకు అనుమతి ఇవ్వాలని గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి లేఖ రాశారు.
కరోనా లాక్ డౌన్ సందర్భంగా నరసరావుపేటలో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే తాను నరసరావుపేటలో ఉన్న అన్నా క్యాంటిన్లను తన ఖర్చుతో నడుపుతానని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
లాక్ డౌన్ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ తాను అన్నా క్యాంటిన్ల ద్వారా పేదల ఆకలి తీర్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. నరసరావుపేట పట్టణంలో ఎక్కడ ఎక్కడ అన్న క్యాంటిన్లు ఉన్నాయో చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు, పేద ప్రజలకు నిరాశ్రయులకు అందరికీ తెలుసు.
కాబట్టి పట్టణంలో ఉన్న అన్న క్యాంటీన్లుకు అనుమతి ఇస్తే తన సొంత నిధులతో పేద ప్రజల ఆకలి తీరుస్తాం అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి కి రాసిన లేఖ లో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఏ ఒక్క హోటల్ గాని టిఫిన్ బండి గాని లేనటువంటి కారణంగా నిరుపేదలు ఆకలితో పస్తులు ఉంటున్నారు.
నేను నరసరావుపేట టిడిపి ఇన్చార్జ్ గా నిరుపేదల దగ్గరికి వెళ్ళినప్పుడు వారిని ఏం కావాలని అడిగితే నాలుగు మెతుకులు భోజనం పెడితే చాలు అని కన్నీరు పెట్టుకున్న పరిస్థితి పట్టణం లో ఉంది. పట్టణంలో మూడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి.
మీరు అనుమతిస్తే ప్రతిరోజు ఒక క్యాంటీన్ కి ఐదు వందల మంది చొప్పున మూడు క్యాంటీన్లలో 1500 మందికి ఉచిత భోజనం నా సొంత డబ్బులతో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని అరవిందబాబు తెలిపారు. కరోనా వైరస్ పూర్తిస్థాయిలో వెళ్లిపోయే వరకూ లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసేవరకూ అన్నదానం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మంచి మనసుతో అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.