నల్గొండ జిల్లా రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం దారిలో రైల్వే లైన్ వద్ద గుట్టకు మలుపు తిరిగే చోట వాన వచ్చిన ప్రతి సారి కట్ట తెగి విలువైన నీరు వృధా అవుతున్నదని ప్రజా పోరాట సమితి (పీఆర్పీఎస్) రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకట్ స్వామి అన్నారు.
నేడు ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ధర్మారెడ్డికాల్వ రైల్వే లైను వద్ద కట్ట తెగడం వల్ల రైతాంగానికి చేరువ కావలసిన విలువైన సాగునీరు వృథా అవుతోందని అన్నారు. ధర్మారెడ్డిపల్లి కాలువ నిర్మాణం జరిగి 20 సంవత్సరాలు అవుతున్నదని, భారీ వర్షాలు కురిసి చెరువుల్లోకి నీరు వచ్చే ప్రతి సందర్భంలో, కొమ్మాయిగూడెం రైల్వే లైన్ వద్ద నీటి ఉధృతికి కట్ట తెగుతున్నదని ఆయన అన్నారు.
దీన్ని ప్రజాపతినిధులు పరిశీలించడం, రెండు మూడు రోజులు హడావుడి చేయడం, మళ్లీ మర్చిపోవడం చేస్తున్నారని ఆయన అన్నారు. దీనికి మరమ్మతులు చేసే వైపున పాలకపక్షం కృషి చేయడం లేదని, గత 10 సంవత్సరాలుగా భారీ వర్షాలు కురిసిన ప్రతి సందర్భంలో ఇదే రైల్వే లైను మూల దగ్గర కాలువ తెగుతోందని ఆయన అన్నారు.
ఈ మూల మలుపులో నీటి ఉధృతిని తట్టుకుని నిర్ణీత చెరువుల వద్దకు సాగునీరు చేరే విధంగా ఒక కిలోమీటరు దూరం వరకూ పటిష్టవంతమైన కరకట్ట నిర్మాణం జరగాలని ఆయన డిమాండ్ చేశారు. గత 4 రోజులుగా భారీ గండి పడి విలువైన సాగునీరు పోతున్న స్థలాన్ని ఆయన నేడు పరిశీలించారు.
ఈ పరిశీలనలో ప్రజా పోరాట సమితి నాయకులు మేకల భిక్షంగౌడ్, బోయపల్లి శేఖర్ గౌడ్, వంగూరి శంకరయ్య, ఎన్నమల్ల పృథ్విరాజ్, చొప్పరి యాదగిరి ముదిరాజ్, నాగటి పరమేష్, కట్ట శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు.