పశ్చిమ బెంగాల్ ప్రజలకు అక్కగా కాకుండా తన మేనల్లుడి కోసం ఒక అత్తలా మారిపోయిన మమతా బెనర్జీని సాగనంపాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. నేడు ఆయన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
పశ్చిమ బెంగాల్ ప్రజలను మమతా బెనర్జీ మోసం చేశారని ఆయన ఆరోపించారు. బిజపి ఎన్నికల ర్యాలీని ఆయన నేడు బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్ లో ప్రారంభించి ప్రసంగించారు. అవిచ్ఛిన్న కమ్యూనిస్టు పాలనలో మోసపోయిన ప్రజలు ఎన్నో ఆశలతో మమతా బెనర్జీని ఎన్నుకుంటే ఆమె కూడా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
తనను అక్కా ని ప్రేమగా పిలిచే ప్రజలకు వదిలేసి బూర్జువా పాలన వైపే మమతా బెనర్జీ మొగ్గు చూపారని ఆయన అన్నారు. ప్రస్తుతం డైమండ్ హార్బర్ నియోజకవర్గం ఎంపిగా ఉన్న అభిషేక్ ను ముఖ్యమంత్రిగా ప్రతిష్టించేందుకు మమతా బెనర్జీ బలవంతంగా ప్రయత్నిస్తున్నారని నరేంద్ర మోడీ అన్నారు.
తన పారిశ్రామికవేత్తల స్నేహితులకు నరేంద్రమోడీ ప్రయోజనాలు చేకూరుస్తున్నారని రాహుల్ గాంధీ తరచూ చేసే ఆరోపణలను ప్రధాని పరోక్షంగా ప్రస్తావిస్తూ తన పశ్చిమ బెంగాల్ స్నేహితుల కోసం 90 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చానని మోడీ తెలిపారు.
తాను టీ అమ్మిన నేపథ్యం నుంచి వచ్చినందున టీ ఎస్టేట్ లలో పని చేసే తన స్నేహితులకు సామాజిక భద్రతా స్కీమ్ తీసుకువచ్చినట్లు ప్రధాని మోడీ తెలిపారు.