కర్నాటకలో సుదీర్ఘకాలం పాటు అవకాశవాద, స్వార్థపూరిత సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అటువంటి ప్రభుత్వాల వల్ల కర్నాటకకు ఎప్పుడూ నష్టాలనే చవిచూసిందని, కాబట్టి కర్ణాటక వేగంగా అభివృద్ధి చెందడానికి పూర్తి మెజారిటీతో స్థిరమైన బిజెపి ప్రభుత్వం చాలా ముఖ్యం అని ఆయన అన్నారు. భారతదేశ అభివృద్ధిలో కర్నాటక ఎదుగుతున్న పవర్హౌస్గా ఉండాలని బిజెపి కోరుకుంటుండగా, రాష్ట్రాన్ని తమ నాయకులకు ఎటిఎమ్గా మార్చాలని కాంగ్రెస్ కోరుకుంటోందని ఆయన అన్నారు.
నేడు కర్ణాటకలోని దావణగెరెలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించారు. బెంగళూరులో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కర్ణాటక లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. నిన్న సోషల్ మీడియాలో కర్ణాటక నుంచి వచ్చిన ఒక వీడియో చూశానని ప్రధాని మోదీ అన్నారు. పార్టీ పెద్ద నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, తన సొంత పార్టీకి చెందిన కార్యకర్తను బహిరంగంగా చెప్పుతో కొట్టి ఆనందిస్తున్నట్లు ఆ వీడియోలో ఉందని ప్రధాని అన్నారు.
తమ కార్యకర్తలను గౌరవించలేని వారు ప్రజలను ఎలా గౌరవిస్తారు? అని ఆయన ప్రశ్నించారు. విజయ్ సంకల్ప్ యాత్ర ను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. అంతకుముందు చిక్బల్లాపూర్లోని మధుసూదన్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ను ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సమక్షంలో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి మాట్లాడుతూ దేశంలో వైద్య కళాశాలల సంఖ్య రెట్టింపు అయ్యిందని అన్నారు.
కర్ణాటకలో మెడికల్ కాలేజీల సంఖ్య 70కి చేరుకుందని చెప్పారు. దేశంలో వైద్య కళాశాలల సంఖ్య 650కి చేరింది. భారత్ తనను తాను అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించుకుందన్నారు. అందరి భాగస్వామ్యంతో దేశం పురోగమిస్తోందన్నారు. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న కర్ణాటక రాష్ట్రానికి ప్రధాని రావడం ఇది ఏడోసారి.