జర్నలిస్టులకు కరోనా వ్యాక్సిన్ ముందుగా అందచేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అందుకు సంబంధించిన మెమోరాండంను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్టప్రతి రామ్ నాథ్ కోవింద్ కు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, కేంద్ర సమాచార శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పంపామన్నారు.
ముందుగా వారికి ఇవ్వడం అభినందనీయం
శనివారం నెల్లూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెమోరాండం కాపీలను ఆయన విడుదల చేశారు
ఈ సందర్భంగా లేఖలోని ముఖ్యాంశాలను వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్నశాస్త్రవేత్తలకు గుజరాత్, పూనే, హైదరాబాద్ లలో పర్యటించి వారిలో విశ్వాసాన్ని ప్రధాని పెంచారన్నారు. ప్రతి రంగంలో ఆలోచించి ముందడుగు వేస్తూ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నప్రధానికి జర్నలిస్టుల తరఫున అభినందనలు తెలిపారు. వ్యాక్సిన్ త్వరలో వస్తుందన్నవిశ్వాసం ప్రజల్లో కలిగిందన్నారు. ప్రస్తుతం ఉన్నసమాచారం ప్రకారం వ్యాక్సిన్ ను ముందుగా వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఆయుష్ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రభుత్వ హాస్పిటల్, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, యాభై సంవత్సరాలు దాటిన వారికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించుకోవటం అభినందనీయమన్నారు.
జర్నలిస్టులను మర్చిపోవడం బాధాకరం
కానీ ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులను మర్చిపోవడం బాధాకరమన్నారు. విధి నిర్వహణలో భాగంగా సమాజహితం కోసం ఆహర్నిశలు శ్రమిస్తూ చావుకు కూడా భయపడకుండా విధులు నిర్వహించిన జర్నలిస్టులు ఎందరో కరోనాతో మృతి చెందారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిజాన్ని ఒక వృత్తిగా కాకుండా ప్రవృత్తిగా భావించి విలేఖరులు విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టులు సమాజానికి సేవలు అందిస్తున్న సేవలు ఎనలేనివన్నారు. జర్నలిస్టులలో చాలా మందికి వేతనాలు లేని సంగతి ప్రభుత్వాలకు కూడా తెలుసునని ఈ నేపథ్యంలో జర్నలిస్టులకు కూడా వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకం ద్వారా జర్నలిస్టులను ఆదుకోవాల్సిందిగా ప్రధానిని లేఖలో కోరామన్నారు. కరోనా టీకాను జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ప్రథమంగా అందించవలసిందిగా విజ్ఞప్తి చేశామన్నారు. విలేకరుల సమావేశంలో సామ్నాఅధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సర్వేపల్లి రామ్మూర్తి, జి హనోక్ తదితరులు పాల్గొన్నారు.