తమ వద్దకు వచ్చే పేషంట్లకు సేవాభావంతో చికిత్స అందించడం శాంతిగిరి లక్ష్యం కావడం సంతోషకరమైనదని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కేరళ కు చెందిన ప్రముఖ ఆయుర్వేద చికిత్స సంస్థ “శాంతిగిరి” వార్షికోత్సవం “నవపూజితం 93” కు ముఖ్య అతిధిగా హాజరయిన ఆయన జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు తిరువనంతపురం లోని శాంతిగిరి రీసెర్చ్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ 60 సంవత్సరాల క్రితం ప్రముఖ ఆయుర్వేద, ప్రకృతి, ఆధ్యాత్మిక చికిత్స వైద్యులు నవజ్యోతి కరుణాకర్ గురువు కేరళలోని చిన్న పూరి గుడిసెలో ప్రారంభించిన శాంతిగిరి ఆశ్రమం నేడు దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించడం గొప్ప విషయం అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 5 శాఖలను కలిగి ఉండడంతో పాటు హైదరాబాద్ లో శిక్షణ సంస్థను నెలకొల్పి, యువతి, యువకులకు శిక్షణతో పాటు, ఉద్యోగులుగా నియమించి వారికి ఉపాధి కల్పించడం సంతోషకరం అని ఆయన అన్నారు. తాను కూడా హైదరాబాద్ లోని శాంతిగిరి సంస్థలో ప్రకృతి చికిత్స తీసుకున్నానని పోచారం అన్నారు. స్వల్ప, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అందించడంతో పాటు, అవసరమైన ఆయుర్వేద ఔషధాలను స్వంతంగా తయారు చేసుకోవడం సంస్థ సామర్ధ్యాన్ని, సంస్థ పట్ల నమ్మకాన్ని మరింతగా పెంచుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో శాంతిగిరి సంస్థ నిర్వాహకులు, శిక్షణ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
previous post
next post