పేదల ఇళ్లను అర్ధరాత్రుల్లో అక్రమంగా కూల్చివేసిన దుండగులపై పోలీసులు చివరకు కఠినంగా స్పందించారు. మేడ్చల్ జిల్లా, కూకట్పల్లి మండలం శంషీగూడ గ్రామంలోని సర్వే నెం.57 ప్రాంతంలో (ఫోర్ట్ ఎస్టేట్ కాలనీలో ) 25 సంవత్సరాలుగా నివాసముంటున్న పేదల ఇళ్లపై కొంతమంది దుండగులు గూండాలు, రౌడీషీటర్ల సహకారంతో దాడులకు పాల్పడి, జేసీబీలతో ఇంట్లో ఉండగానే ఇళ్లు కూల్చుతున్న ఘటనలు పలుమార్లు వెలుగులోకి వచ్చాయి.
బాధితులు పదే పదే పోలీసులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు లేకపోవడంతో, చివరకు హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలు చేసిన వ్రిట్ పిటిషన్పై విచారణ జరగుతోంది. ఈ పిటిషన్ తో పాటు, బాధితుల నుండి వచ్చిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఎవిక్షన్ ఉత్తర్వులు లేకుండా ఇళ్లు కూల్చిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో శంషీగూడ ప్రాంతంలో అనేక ఇళ్లను అక్రమంగా కూల్చడంలో ప్రధాన పాత్ర పోషించిన పి. వెంకటేశ్వరరావు, వెంకట్ అనే ఇద్దరు నిందితులను శుక్రవారం జగద్గిరిగుట్ట సీఐ నర్సింహా నేతృత్వంలో, బాలానగర్ డీసీపీ కార్యాలయంలో బైండోవర్ చేశారు. వీరిపై జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. కోర్టుల నుండి ఇంటరిమ్ ఇంజెక్షన్ ఆర్డర్లు ఉన్నా పట్టించుకోకుండా, అర్ధరాత్రిళ్లు వందలమంది కిరాయి గుండాలు దౌర్జన్యంతో ఇళ్లు కూల్చడంతోపాటు ఇంట్లో ఉన్న మహిళలు, వృద్ధులపై దాడులకు పాల్పడ్డట్టు బాధితులు పేర్కొన్నారు.
ఈ ఘటనలపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ స్థాయిలో అరాచకాలు జరగడమే కాకుండా, అధికార యంత్రాంగం దీన్ని ప్రారంభంలో నిర్లక్ష్యంగా తీసుకున్నదంటూ పలువురు ఆరోపిస్తున్నారు. పోలీసుల తాజా చర్య పాజిటివ్గా ఉన్నప్పటికీ, బాధితులు మాత్రం నిందితులపై కఠిన చర్యలు తీసుకొని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.