నిషేధిత గుట్కాను స్మగ్లింగ్ చేస్తున్న రాకెట్ ను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావుకు అందిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఏడిసిపి కె.వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించి భారీగా గుట్కా పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
వారధి వద్ద వాహనాల తనిఖీలు చేయగా బెంగుళూరు నుండి రావులపాలెం తరలిస్తున్న నలుగుర్ని శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు రూ. 26,80,600 లక్షలు విలువైన గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంజయ్ కుమార్(30) చూరు జిల్లా, రాజస్థాన్. ప్రస్తుతం బెంగుళూరు(లారీ ఓనర్), కర్పూరం వాసు(48), అయ్యప్ప టౌన్షిప్, జంగారెడ్డి గూడెం, గ్రంధి వెంకట మణికంఠ(48), రోటరీ స్ట్రీట్, నిడదవోలు, ఇంకొల్లు రామకృష్ణ(49), వధుగార్డున్స్, విజయవాడకు చెందిన నిందితులను అరెస్టు చేశారు.
బెంగుళూరులో ఉంటున్న రాహుల్ పాఠక్ అనే వ్యక్తి గుట్కా పౌచ్లు తయారుచేసి అక్రమంగా అమ్ముతుంటాడు. ప్రసాద్ అనే వ్యక్తికి మధ్యవర్తిగా ఉండేవాడు. రామకృష్ణ, వాసు, మణికంఠలు నిషేదిత గుట్కాలను బెంగుళూరు నుండి తెచ్చి ఆంధ్రాలో అమ్ముతుంటారు. రావులపాలెం, తాడేపల్లి గూడెం, జంగారెడ్డి గూడెం, నల్లజర్ల లోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తూ లాభార్జన చేస్తున్నారు. పొగాకు, సున్నం, అరెకానట్తో తయారుచేసిన గుట్కా, ఖైనీని సేవించిన వారు మానసికంగా ఉత్తేజం అవుతారు. ఆ తర్వాతి కాలంలో నోటి క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్ కు దారి తీస్తుంది.