సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లపై దాడి చేసిన ఇద్దరిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. 55 ఏళ్ల కరోనా రోగి పరిస్థితి విషమించి మరణించడంతో అతని బంధువులు అక్కడ డాక్టర్ పై దాడి చేశారు. ఇనుప కుర్చీతో వైద్యుడిని తీవ్రంగా గాయపరిచాడు. దాంతో మంగళ వారం అర్ధ రాత్రి వరకూ గాంధీ ఆసుపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
వైద్యులు ధర్నా చేసి విధులను బహిష్కరించారు. నేడు కూడా డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. సీపీ చౌహాన్, నార్త్ జోన్ డీసీపీ కల్మేశ్వర్ లు వైద్య సిబ్బందికి నచ్చ చెప్పినా వినలేదు. గాంధీ ఆసుపత్రిలో వైద్యులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కాగా డాక్టర్ పై దాడి కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.