ధరణి పోర్టల్ తో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షను ఆరంభంలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం 9 గంటలకే రమణారెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రమణారెడ్డిని అరెస్ట్ చేసి నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు సమాచారం.
కార్యకర్తల ఆందోళన
రమణారెడ్డిని అరెస్ట్ చేయడంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మున్సిపల్ వద్ద ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో కుర్చీలు, టెంటులను పోలీసులు తొలగిస్తున్నారన్న సమాచారంతో కార్యకర్తలు అక్కడికి చేరుకుని దీక్ష శిబిరంలో కూర్చుని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో డిఎస్పీ సోమనాథం కలుగజేసుకుని జిల్లాలో 30 యాక్ట్ అమలులో ఉందని, దీక్ష శిబిరంలో అధిక సంఖ్యలో గుమిగూడటం చట్టరీత్య నేరమని, 5 నిమిషాలలో స్వచ్చందంగా టెంట్ నుంచి వెళ్లిపోవాలని లేకపోతే అందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దాంతో పోలీసుల తీరుకు నిరసన నిజాంసాగర్ చౌరస్తాలో ఆందోళన చేయాలని కార్యకర్తలు ప్రకటించడంతో కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని డిసిఎం వ్యానులో ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
పోలీసుల ముందస్తు చర్యలు
ధరణి సమస్యలపై మూడు రోజులు నిరసన, మూడు రోజులు నిరాహార దీక్షలతో రైతులలో కదలిక వచ్చింది. ఆరు రోజులుగా వేలాది మంది రైతులు దీక్ష శిబిరానికి వచ్చి తమ సమస్యలు వెంకట రమణారెడ్డితో చెప్పుకున్నారు. ఆమరణ దీక్ష ప్రకటనతో రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం మేరకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రైతులు అధిక సంఖ్యలో దీక్ష శిబిరం వద్దకు చేరుకుంటే వారిని అడ్డుకునే అవకాశం లేకపోవడంతో ముందస్తుగానే రమణారెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది
బండి సంజయ్ తో సమావేశం..ఎంపీ అరవింద్ రాక
ఆమరణ దీక్ష సందర్బంగా నియోజకవర్గంలో రైతుల నుంచి వస్తున్న స్పందన బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సోమవారం రాత్రి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార, కాటిపల్లి వెంకట రమణారెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిశారు. రమణారెడ్డి చేపట్టిన దీక్షపై బండి సంజయ్ ఆరా తీసినట్టు తెలిసింది. అలాగే నేటి ఆమరణ దీక్ష సందర్బంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వస్తున్నారని, దాంతో ఇష్యు మరింత పెద్దగా అయ్యే అవకాశాలు కనిపించడంతో దీక్ష భగ్నం చేయడానికి కూడా కారణమయ్యాయని తెలుస్తోంది.