కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో నిమగ్నమైన పోలీసు యంత్రాంగం తబ్లిగీ జమాత్ నాయకుడు మౌలానా మహమూద్ సాద్ ఖండల్వీ ని అరెస్టు చేసే విషయం పై పెద్దగా శ్రద్ధ చూపుతున్నట్లు కనిపించడం లేదు. మరో వైపు సాద్ మాత్రం తనను అరెస్టు చేస్తే దేశంలో ఎక్కడెక్కడ నిరసన ప్రదర్శనలు చేయించాలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ఢిల్లీ నిజాముద్దీన్ లో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి మరీ భారీ సభ నిర్వహించిన సాద్ మరో ఆరు గురిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన నాటి నుంచి సాద్ అండ్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. కేవలం ఆయన లాయర్లు మాత్రమే పోలీసులతో మాట్లాడుతున్నారు.
సాద్ ఢిల్లీలోని తన సన్నిహితుడి ఇంటిలోనే దాక్కొని ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం ఉన్నా కూడా ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్టు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ నాయకుడిని అరెస్టు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, అలాంటిది జరిగితే తాము ఊరుకునే ప్రశ్నే లేదని తబ్లిగీ జమాత్ లక్నోకు చెందిన ఒక కార్యకర్త హెచ్చరించినట్లు వార్తలు వెలువడ్డాయి.
తబ్లిగీ జమాత్ సభ్యులపై సాద్ ప్రభావం ఎంతో తీవ్రంగా ఉంటుంది. సాద్ మాట అంటే తబ్లిగీ జమాత్ సభ్యులకు అంత నమ్మకం. అలాంటి సాద్ ను అరెస్టు చేస్తే దేశంలోని చాలా ప్రాంతాలలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని పోలీసులు కూడా అంచనా వేస్తున్నారు.