కులం పేరుతో అమాయకులను లాకప్ లో చిత్ర హింసలు పెట్టిన పోలీసులను జైభీమ్ సినిమాలో చూపించారు. దాదాపుగా అదే తరహా పోలీసు క్రౌర్యం చిత్తూరు జిల్లాలో వెల్లడి అయింది. చిత్తూరు నగరంలోని లక్ష్మీ నగర్ కాలనీకి చెందిన ఉమా మహేశ్వరి చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణు గోపాల్ రెడ్డి ఇంట్లో ఏడాది కాలంగా పని చేస్తోంది.
వేణు గోపాల్ రెడ్డి ఇంట్లో రూ. రెండు లక్షల నగదు కనిపించక పోవడంతో ఉమా మహేశ్వరిని ప్రశ్నించారు. నగదు కనిపించక పోవడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఉమా మహేశ్వరి చెప్పినా వినకుండా పోలీసులను పిలిపించారు.
ఈ నెల 18 వ తేదీ చిత్తూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్కు తనను పిలిపించి చేతి వేలి ముద్రలు తీసుకుని పోలీసులు పంపించేసినట్లు ఉమా మహేశ్వరి మీడియాకు తెలిపారు. అనంతరం 19 వ తేదీ తనను మళ్లీ పోలీసు స్టేషన్ కు పిలిచి కాళ్ళు చేతులు కట్టేసి లాఠీలతో తీవ్రంగా స్పృహ కోల్పోయే వరకు కొట్టినట్లు ఆమె తెలిపింది.
పోలీసు దెబ్బలకు తీవ్రంగా గాయపడ్డ ఉమా మహేశ్వరి అస్వస్థతకు గురికావడంతో ఆమె భర్త, తల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.తనను పలుమార్లు కులం పేరుతో పోలీసులు దూషించారని ఆమె ఆరోపించారు. అనంతరం దొంగతనం సంఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని విచారణలో తెలిసిందని ఆమె చెప్పారు.
తనకు తగిలిన గాయాలకు చికిత్స చేయించి పరిహారం ఇస్తామని పోలీసులు చెప్పినట్లు వెల్లడించారు. ఈ విషయం బయట ఎవరికీ చెప్పకూడదని పోలీసులు బెదిరించినట్లు ఉమా మహేశ్వరి పేర్కొన్నారు. అకారణంగా తనను దొంగతనం పేరుతో చిత్రహింసలు చేసిన పోలీసులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు.