పోలీసులు ఒక పిల్లవాడి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది. పిల్లాడిని పోలీసులు చెప్పులు, కర్రలతో కొడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. దీంతో ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. దామో జిల్లాలోని కోత్వాలి పోలీస్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది.
వీడియోలో ఇద్దరు పోలీసులు ఓ అమాయకపు బాలుడిని చెప్పులు, కర్రలతో చితకబాదుతున్నారు. ఎందుకు కొడుతున్నారో అనేది తెలియదు. కానీ కొట్టొద్దని ఎంత వేడుకున్నా వినకుండా పోలీసులు ఆ బాలుడిని నవ్వుతూ కొడుతూనే ఉన్నారు. ఆ బాలుడు ఏడుస్తూ చివరకు పోలీసుల కాళ్ల మీద పడ్డాడు.
ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. బాలుడిని కొడుతున్న పోలీసులను గుర్తించారని, వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సింగ్ తెలిపారు. వీడియోలో ఉన్నది మహేష్ యాదవ్ ,మనీష్ గాంధర్వ్ అనే కానిస్టేబుళ్లుగా గుర్తించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కమల్ నాథ్ స్పందించారు.
బాలుడిని కొడుతున్న ఘటనపై త్వరగా దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించామని ట్వీట్ చేశారు. ఇటువంటి అమానవీయ సంఘటనలు మానవత్వంపై మచ్చలాంటివని అన్నారు.